చిన్న పరిశ్రమలకు ఉజ్వల భవిత

‘భారత్‌లో తయారీ’లో కీలక భూమిక వాటిదే

తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు అపారం
పారిశ్రామిక విధానాలతో వూతం
‘ఈనాడు’తో జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ సీఎండీ రవీంద్రనాథ్‌

భారత్‌లో తయారీ (మేక్‌ ఇన్‌ ఇండియా)లో చిన్న పరిశ్రమలు కీలక పాత్ర వహిస్తాయని జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌-ఎన్‌ఎస్‌ఐసీ) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్న పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రెండు ప్రభుత్వాలు ప్రకటించిన పారిశ్రామిక విధానం ఇందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు పురోగమించాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఐసీ సీఎండీ రవీంద్రనాథ్‌ శుక్రవారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

అంతటా చిన్న పరిశ్రమలే...

చైనా వంటి దేశాలు చిన్న పరిశ్రమలతోనే అగ్రగాములుగా ఎదిగాయి. మన దేశంలోనూ అవి అభివృద్ధికి ఆనవాళ్లుగా నిలిచాయి. కుగ్రామాలు మొదలుకొని మహానగరాలన్నింటిలోనూ చిన్న పరిశ్రమలున్నాయి. అతి తక్కువ పెట్టుబడి, మౌలిక వసతులతో ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి కల్పనలో చిన్న పరిశ్రమలదే పెద్దవాటా. చిన్న పరిశ్రమల ప్రాధాన్యాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియాలో వాటికి కీలకభాగస్వామ్యం కల్పించింది. తెలుగు రాష్ట్రాల్లో చిన్న పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. చంద్రయాన్‌ వంటి ప్రాజెక్టులతో పాటు రక్షణ, వైమానిక ఉత్పత్తులను అవే అందజేస్తున్నాయి.

ఉపాధికి ఉత్తమ మార్గం

చిన్న పరిశ్రమలకు విస్తృత అవకాశాలున్నాయి. విద్యావంతులైన నిరుద్యోగులకు, వృత్తివిద్యను అభ్యసించిన వారికి ఇదే సరైన మార్గం. కేంద్ర ప్రభుత్వం వాటి కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. 1955లో ఏర్పాటైన మా సంస్థ చిన్న పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉంది. వాటికి మార్కెటింగ్‌, బ్యాంకు రుణాలు, యంత్రసామగ్రి కొనుగోలు, మౌలిక వసతులు, సాంకేతికపరంగా సాయం అందిస్తున్నాం. సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల సంస్థ ద్వారా వాటికి సేవలు అందుతున్నాయి.

‘ముద్ర’ వరప్రసాదమే

చిన్న పరిశ్రమలకు సమస్యలూ ఉన్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారు వీటిని ఏర్పాటు చేస్తుండగా... పెట్టుబడులకు ఇబ్బందులెదురవుతున్నాయి. బ్యాంకుల నుంచి ఆశించిన సహకారం లేదు. మార్కెటింగ్‌ వనరులు తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముద్ర పథకం వీరికి వరప్రసాదంగా మారింది. పూచీకత్తు లేకుండా రూ.పది లక్షల వరకు సాయం అందుతోంది. రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకులూ ముందుకు రావాలి.

సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలి

చిన్న పరిశ్రమలకు భారీఎత్తున పోటీ ఉంది. సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొంటే శ్రమ తగ్గి, నాణ్యత పెరిగి, డిమాండ్‌ వచ్చే వీలుంది. మా సంస్థ తరపున శిక్షణ, ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ ఇవి ఉన్నాయి. హైదరాబాద్‌లో సాంకేతిక సేవల కేంద్రం ఉంది. ఇవిగాక కొత్తగా మరికొన్నికేంద్రాలను నెలకొల్పుతాం. పారిశ్రామికవేత్తలకు ఆధునిక నైపుణ్య శిక్షణను అందిస్తాం. విదేశీ సంస్థల సాయం తీసుకుంటాం.

ఆశావహ దృక్పథంతో...

చిన్న పరిశ్రమలను కాపాడుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. తెలుగు రాష్ట్రాలు కొత్త పారిశ్రామిక విధానాల్లో వాటికి పెద్దపీట వేయడం అభినందనీయం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆశావహ దృక్పథంతో పరిశ్రమలను ప్రారంభించాలి. ఆరంభంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి అందులో నిలదొక్కుకుంటే వారికి తిరుగు ఉండదు.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

List of Cloud Certifications