చైనాను మించి భారత్ వృద్ధిరేటు

వాషింగ్టన్: భారత జిడిపి వృద్ధిరేటు చైనా కంటే వేగంగా పరుగులు పెడుతోందని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే వృద్ధిపథంలో పయనిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) స్పష్టం చేసింది. వచ్చే ఏడాది 7.5 శాతంగా భారత జిడిపి వృద్ధిరేటు నమోదు కావచన్న ఐఎమ్‌ఎఫ్.. చైనా 6.3 శాతానికి పరిమితం కావచ్చంది. ‘్భరత వృద్ధిరేటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే పరుగులు పెడుతోంది.’ అని తాజాగా ఇక్కడ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో ఐఎమ్‌ఎఫ్ అభిప్రాయపడింది. ‘ఈ ఏడాది భారత వృద్ధిరేటు గత ఏడాది నమోదైన 7.3 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. వచ్చే ఏడాది 7.5 శాతంగా ఉండొచ్చని అనుకుంటున్నాం. ఇటీవలి సంస్కరణలు వృద్ధిరేటు పురోగతికి దోహదపడుతున్నాయి. పెట్టుబడుల్లో వృద్ధి, ఉత్పాదక ద్రవ్యోల్బణం తగ్గుదల వంటివి భారత్‌కు కలిసొస్తున్నాయి.’ అని ఐఎమ్‌ఎఫ్ తమ ప్రపంచ ఆర్థిక తీరుతెన్నుల నివేదికలో వ్యాఖ్యానించింది. మరోవైపు చైనా వృద్ధిరేటు ఈ ఏడాది 6.8 శాతానికి పడిపోవచ్చని, వచ్చే ఏడాది 6.3 శాతానికే పరిమితం కావచ్చని చెప్పింది. దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితులు వచ్చే ఏడాదీ చక్కబడకపోవచ్చన్న అభిప్రాయాన్ని పరోక్షంగా ఐఎమ్‌ఎఫ్ చెప్పినట్లైంది. ఇకపోతే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.1 శాతంగా ఉంటుందని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది. ఇది గత ఏడాది నమోదైన వృద్ధిరేటు కంటే 0.3 శాతం తక్కువైతే, ఈ ఏడాది జూలై ఔట్‌లుక్‌లో వేసిన అంచనా కంటే 0.2 శాతం దిగువ కావడం గమనార్హం. కాగా, ఈ ఏడాది మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొంటున్న లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో వచ్చే ఏడాది పరిస్థితులు సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

World’s largest aftermarket services iQor to invest $200 million in India