Skip to main content

5,000 ఎకరాల్లో 20 క్లస్టర్లు జోరుగా మొబైల్‌, ఎల్‌ఈడీ, ఫొటోవోల్టాయిక్‌, ఆటో ఎలక్ట్రానిక్స్‌ తయారీ

పురోగమన పథంలో ‘ఎలక్ట్రానిక్స్‌’ 
ఏడాదిలో రూ.లక్ష కోట్ల ప్రతిపాదనలు 
5,000 ఎకరాల్లో 20 క్లస్టర్లు 
జోరుగా మొబైల్‌, ఎల్‌ఈడీ, ఫొటోవోల్టాయిక్‌, ఆటో ఎలక్ట్రానిక్స్‌ తయారీ  

దేశీయ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమకు దశ తిరగనుంది. గత ఏడాదిన్నర కాలంలో దేశీయంగా వచ్చిన విధానపర మార్పులు, చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వివిధ సానుకూల అంశాలతో రానున్న కొద్ది సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు పెరగనున్న గిరాకీ.. దేశీయ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమను కొత్త పథంలోకి తీసుకువెళ్లనున్నాయి. దేశంలో ‘పురోగమిస్తున్న పరిశ్రమ’ (సన్‌రైజింగ్‌ పరిశ్రమ)గా ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ కొనసాగనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలు, ప్రోత్సాహకాల ద్వారా పరిశ్రమకు వూతమిస్తున్నప్పటికీ.. పెరిగే గిరాకీని అందుకోవడానికి ఈ పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంటున్నాయి. ఇంకా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. 

గత ఏడాది కాలంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో పెట్టుబడులకు వివిధ కంపెనీల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా ప్రతిపాదనలు వచ్చాయి. మార్పులు చేసిన ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీ పథకం (ఎంఎస్‌ఐపీఎస్‌) కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (డైయిట్‌) అదనపు కార్యదర్శి అజయ్‌ కుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఫాక్స్‌కాన్‌, ఎల్‌జీ, శామ్‌సంగ్‌, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వంటి ఎన్నో పెద్ద కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వచ్చాయన్నారు. ‘దాదాపు 5,000 ఎకరాల్లో విస్తరించిన 20 ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు దేశంలో ఉన్నాయి. మొబైల్‌, ఎల్‌ఈడీ, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌, ఆటోమొబైల్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో తయారీ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో ఈ విభాగాల్లో ఎంతో మార్పు వచ్చింద’న్నారు. చైనాలో జీవన వ్యయం పెరిగిందని, అక్కడి ప్రధాన నగరాల్లో వేతనాలు పెరిగాయని మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మెయిట్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ కున్‌కోలియన్‌కర్‌ తెలిపారు. ‘చైనాలో వ్యయాలు పెరగడంతో మదుపర్లు భారత్‌ వైపు చేస్తున్నారు. రాజకీయంగా, వాణిజ్య పరంగా తమకు అనువైన భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని తైవాన్‌ కంపెనీలు భావిస్తున్నాయి. జపాన్‌ కంపెనీలు సైతం భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీకే కాక ఎగుమతులకు కేంద్రంగా భారత్‌ను మార్చడానికి అనువైన వ్యవస్థ (ఎకో సిస్టమ్‌)ను ఇప్పుడు అభివృద్ధి చేయాల్సి ఉంద’న్నారు. 

హైదరాబాద్‌ వాటా 6% 
దేశంలో జరుగుతున్న ఎలక్ట్రానిక్స్‌ వినియోగంలో 65 శాతం పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోనే ఉందని, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ఎలక్ట్రానిక్స్‌ తయారీకి అనేక సానుకూల అంశాల ఉన్నాయన్నారు. ‘దేశీయ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిలో హైదరాబాద్‌ (తెలంగాణ) వాటా 6 శాతం ఉంది. 250 కంపెనీలు దాదాపు రూ.6,000 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో నాలుగో వంతును ఎగుమతి చేస్తున్నాయి. 50 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్ల అందుబాటులోకి వస్తున్నాయి. జపాన్‌, తైవాన్‌ కంపెనీలను శ్రీసిటీ ఆకర్షిస్తోంద’ని తెలిపారు. 

గిరాకీని పెంచే అంశాలు అనేకం.. 
క్లౌడ్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానాలు భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. డిజిటల్‌ ఇండియా 70% అమల్లోకి వచ్చినా ఎలక్ట్రానిక్స్‌కు భారీగా గిరాకీ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎలక్ట్రానిక్స్‌ గిరాకీ కేవలం ఐటీ హార్డ్‌వేర్‌కే పరిమితం కావడం లేదు. గృహోపకరణాలు, వాహనాలు వంటి అనేక రంగాల్లో ఎలక్ట్రానిక్స్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం యువత 50-60% వ్యయాన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులపైనే ఖర్చు చేస్తోంది. ఇదే ధోరణి రానున్న కాలంలో కూడా కొనసాగుతుంది. ఆరోగ్య సంరక్షణ, రక్షణ, టెలికాం తదితర రంగాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు గిరాకీ బాగా పెరగుతుతోంద’ని మెయిట్‌ అధిపతి (దక్షిణ ప్రాంత) ఎస్‌.జయరాజ్‌ తెలిపారు. గత ఏడాది కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా స్టార్టప్‌లు పుట్టుకొస్తున్న దేశంగా భారత్‌ నిలిచిందని, ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమకు ఇది చాలా సానుకూల అంశమని డైయిట్‌ అదనపు కార్యదర్శి అజయ్‌ కుమార్‌ అన్నారు. ‘ప్రస్తుతం 50 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేస్తున్నాం. ఏడాదికి 5-10 కోట్ల ఫోన్లను తయారీ చేయాలన్నది మన లక్ష్యం. 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో 50% సామర్థ్యానికి అవసరమైన ఫొటోవోల్టాయిక్‌ పరికరాలను తయారు చేసినా.. దేశీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమకు భారీ అవకాశాలు లభిస్తాయి. ప్రాంతీయ భాషల్లో ఎస్‌ఎంఎస్‌లను ఇచ్చే సదుపాయాన్ని కల్పించడం వంటి చిన్న మార్పుల ద్వారా మొబైల్‌ ఫోన్ల వాడకాన్ని పెంచొచ్చు. విదేశీ కంపెనీలతో పోటీపడి మైక్రోమ్యాక్స్‌, లావా వంటి కంపెనీలు స్మార్ట్‌ఫోన్లను చౌక ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అదే విధంగా రూ.10,000లోపు లాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకురాగలిగితే కంపెనీలకు భారీ వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమను వృద్ధిపథంతో నడుపుతాయి. 2020 నాటికి 40,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.26 లక్షల కోట్లు) స్థాయికి దేశీయ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌ చేరనుంద’ని అన్నారు. గిరాకీకి అనుగుణంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ వ్యవస్థను బలోపేతం చేయకపోతే.. దిగుమతుల్లో ఇప్పుడు చమురు తర్వాత రెండో స్థానంలో ఉన్న ఎలక్ట్రానిక్స్‌, మొదటి స్థానంలోకి వచ్చే ప్రమాదం ఉందని మెయిట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పేర్కొన్నారు.

(ఈనాడు వారి సౌజన్యంతో )

Comments