అనంత’లో భారీ బెల్‌ ఫ్యాక్టరీ


రూ.500 కోట్ల పెట్టుబడి

30/09/2015  రక్షణ మంత్రి శంకుస్థాపన



బెంగళూరు : నవ్యాంధ్రలో తొలి రక్షణ ఫ్యాక్టరీకి రంగం సిద్ధమవుతోంది. సైనిక దళాలకు అవసరమైన వివిధ ఆయుధ వ్యవస్థల తయారీ కోసం ప్రభుత్వ రంగంలోని భారత ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) అనంతపురం జిల్లా పాలసముద్రం సమీపంలో సమగ్ర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతోంది. రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ బుధవారం ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో 900 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ సమగ్ర ఫ్యాక్టరీని మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని బెల్‌ భావిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో బెల్‌ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇది దేశంలోనే అతి పెద్ద బెల్‌ ఫ్యాక్టరీ అవుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. రక్షణ రంగంలో భవిష్యత్‌లో ఏర్పడే వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లాలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు బెల్‌ సిఎండి ఎస్‌.కె.శర్మ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే క్షిపణులు, రాకెట్ల తయారీ వ్యాపారం మరింత విస్తరిస్తుందని బెల్‌ భావిస్తోంది. ఇప్పటికే ఉన్న కొన్ని ఆయుధ వ్యవస్థలతో పాటు కొత్త ప్రాజెక్టులను సైతం ఈ యూనిట్‌లో చేపట్టాలని యోచిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పాలసముద్రం ఫ్యాక్టరీలో బెల్‌ అసెంబ్లీ హ్యాంగర్లు, రాడార్లు, ఆయుధ వ్యవస్థల కూర్పు కోసం హార్డ్‌ స్టాండ్స్‌ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్‌లో సైనిక దళాలకు అవసరమయ్యే ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే (శామ్‌) మిస్సయిల్స్‌, వాటికి సంబంధించిన ఎలక్ర్టానిక్‌ ఉప వ్యవస్థలు, విడి భాగాలను కూడా ఈ యూనిట్‌లో తయారు చేస్తారు. ముందు ముందు ఈ యూనిట్‌లో సైనిక పారిశ్రామిక సముదాయం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయని భావిస్తున్నారు.


Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

World’s largest aftermarket services iQor to invest $200 million in India