రూ.వందల కోట్ల విలువైన పాల ఉత్పత్తి సంస్థను నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళలు
2,279 గ్రామాల నుంచి సేకరణ
94 పాల శీతలీకరణ కేంద్రాలు, రూ.175 కోట్ల చెల్లింపులు
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సేవలు
వారంతా సాధారణ మహిళలే. చేయీ చేయీ కలిపారు. క్షీరసాగరాన్ని మధించే స్థాయికి ఎదిగారు. గ్రామాల్లో పాల సేకరణతో వందల మందికి ఉపాధిని కల్పిస్తూ దిల్లీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. ఇంటిని చక్కబెట్టినంత తేలిగ్గా.. సంస్థను నడిపిస్తూ సరికొత్త పాలవెల్లువను సృష్టిస్తున్నారు. ఒకటి రెండు కాదు.. రెండు వేల గ్రామాల్లో.. రోజూ మూడు లక్షల లీటర్ల పాలను సేకరించి సరఫరా చేస్తున్నారు. ఎక్కడా ఏమాత్రం తేడా లేకుండా.. అంతా పక్కాగా నడిపిస్తున్నారు. వీరి క్షీర సామ్రాజ్యాన్ని పరిశీలిస్తే ఎంతవారైనా ఔరా..! అనకమానరు. ఆ మహిళలు ఎక్కడి వారో కాదు. మన తెలుగువారే. అనంత, చిత్తూరు జిల్లాలకు చెందిన ఆడపచులే. దేశంలోనే పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న పాల ఉత్పత్తి మండలిపై ప్రత్యేక కథనం.
రెండు వేల గ్రామాలు... 94 పాల శీతలీకరణ కేంద్రాలు.. రోజుకు 3 లక్షల లీటర్ల సేకరణ.. దిల్లీకీ సరఫరా.. ఇదంతా సజావుగా సాగుతుందంటే దానివెనుక ప్రభుత్వ యంత్రాంగమో.. ఏదైనా పెద్ద ప్రైవేటు సంస్థో ఉందనుకుంటాం. కానీ, మహిళా సమాఖ్యలే ఇదంతా సాధ్యంచేసి చూపిస్తున్నాయి. పాల సేకరణ నుంచి వ్యాపార లావాదేవీలన్నీ చూసుకోవడం వరకు అడుగడుగునా మహిళలే నడిపిస్తున్నారు. ఇంతపెద్ద వ్యవస్థను ఏర్పరుచుకుని ఏకంగా తామే వాటాదారులుగా ఒక సంస్థను స్థాపించుకున్నారు. రోజుకు సుమారు 3 లక్షల లీటర్ల పాలను సేకరించి పాడిరైతులకు మంచి ధర ఇస్తున్నారు.. దిల్లీ వరకు సరఫరా చేస్తున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మహిళా సమాఖ్యలు దేశంలోనే తమకంటూ ప్రత్యేకత సాధించుకున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఆనవాయితీగా వచ్చే పాల విక్రయాలను వ్యవస్థీకృతం చేసి వ్యాపారంగా మలిచారు డ్వాక్రా మహిళలు. పాల వ్యాపారానికి ప్రత్యేక సంస్థను ఏర్పరిచి పాడిరైతులకు, మహిళా సంఘాల సభ్యులకు లాభం చేకూరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 54 మండలాలు, అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో మహిళల ఆధ్వర్యంలో మొదలైన పాల వ్యాపారం అంచెలంచెలుగా విస్తరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
మహిళా సమాఖ్యల ఆధ్యర్యంలో గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి కేంద్రానికి ఒక మహిళను పాలమిత్ర పేరుతో నియమించి సేకరణ బాధ్యతలు అప్పగించారు. వారికి కమీషన్ పద్దతిలో కొంత వేతనం ఇస్తారు. 2,279 గ్రామాల్లో కేవలం మహిళలే నిర్వహిస్తున్న సేకరణ కేంద్రాలున్నాయి. సేకరించిన పాలను మండల మహిళా సమాఖ్యలు నిర్వహించే శీతలీకరణ కేంద్రాలకు(బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్-బీఎంసీయూ) చేరుస్తారు. అక్కడ పాలను శీతలీకరించి వాటిని డెయిరీలకు పంపిస్తారు. ఈ కేంద్రాలను నిర్వహించే మహిళా సమాఖ్యలకూ కమీషన్ వస్తుంది. ఈ కమీషన్ మొత్తాన్ని కొంత మహిళా సమాఖ్యలు ఉంచుకుని మిగిలింది ఆయా కేంద్రాల్లో పనిచేసే మహిళలకు జీతాలుగా చెల్లిస్తారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 94 కేంద్రాలను మహిళలే నిర్వహిస్తున్నారు. మరోవైపు పాల కొనుగోలు, విక్రయాలకు వీలుగా జాతీయ పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ(ఎన్డీడీబీ) సహకారంతో ‘‘శ్రీజ మహిళా పాల ఉత్పత్తి సంస్థ’’ ప్రారంభించారు. సేకరణ కేంద్రాల్లో పాలు పోస్తున్న 45 వేలమంది ఇందులో వాటాదారులు. ప్రతి వాటాదారుకు ఒక్కొక్కటి రూ.100 చొప్పున అయిదు వాటాలు ఉంటాయి. సహకార విలువలతో కంపెనీ విధానంలో నిర్వహించేలా దీన్ని ఏర్పరిచారు. ఏడాదికి సుమారు రూ.175 కోట్ల చెల్లింపులు చేస్తున్నారు.
తక్కువ ఖర్చుతో పాల ఉత్పత్తి
పాడిపశువులకు ఎలాంటి మేత పెట్టాలి.. వెన్నశాతం, ఎస్ఎన్ఎఫ్ శాతం పెరగాలంటే ఏం చేయాలి? రైతులకు తక్కువ ఖర్చుతోనే ఒక లీటరు పాల ఉత్పత్తి చేసేందుకు ఏం చేయాలి? అన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ.. సమతుల పశు ఆహార విధానాన్ని రైతులకు శ్రీజ మహిళా పాల ఉత్పత్తి మండలి చేరువ చేస్తోంది. ఎన్డీడీబీ రూపొందించిన ఈ విధానాన్ని ఇక్కడి పల్లెల్లో అమలుచేయడం విశేషం. దీనికోసం 150 మంది మహిళలను స్థానిక రిసోర్స్ పర్సన్(ఎల్ఆర్పీ)లుగా నియమించారు. వీరు పశువుకు అవసరమైన పోషకాల వివరాలు రైతులకు చెబుతారు. శ్రీజ మహిళా పాల ఉత్పత్తి మండలికి ప్రపంచబ్యాంకు నుంచి గ్రాంటు లభించింది. దీన్ని ప్రతి గ్రామంలోను పాలసేకరణ కేంద్రాల వద్ద యంత్రాలు ఏర్పాటుచేయడానికి, సమతుల ఆహార పథకానికి ఉపయోగించనున్నట్లు పాల ఉత్పత్తుల మండలి సీఈవో ప్రసాద్ తెలిపారు.ఇక్కడి మహిళలు సాగిస్తున్న పురోభివృద్ధి మరిన్ని ఉత్పాదక మండళ్లు ఏర్పాటుకు దోహదపడుతుందని సెర్ప్ సలహాదారు రామలక్ష్మి తెలిపారు.
అంగన్వాడీలకూ సరఫరా చేస్తున్నారు: గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు అక్కడి మహిళా సంఘాలే పాలు సరఫరా చేస్తున్నాయి. దీంతో ఎంత పాలు సరఫరా చేస్తున్నారు.. పిల్లలకు సక్రమంగా అందుతుందా లేదా అన్నది అన్నది పారదర్శకంగా ఉంటోంది. మరోవైపు గతంలో లీటరుకు రూ.32 ధరకు అంగన్వాడీ కేంద్రాలు కొనుగోలు చేయగా ఇప్పుడు రూ.27కే మహిళా సంఘాలు సరఫరా చేస్తున్నాయి.
- రవిప్రకాష్, పీడీ, డీఆర్డీఏ, చిత్తూరు
లాభం మహిళలకే..
మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 94 శీతలీకరణ కేంద్రాలూ లాభాల్లో ఉండడం విశేషం. ఈ ఏడాది మొత్తంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోని బీఎంసీయూలకు వచ్చిన లాభం రూ.1.84 కోట్లు. ఈ లాభాలను ఆయా మండల మహిళా సమాఖ్యలు తమ పరిధిలోని గ్రామ సమాఖ్యలు, డ్వాక్రా సంఘాలకు అవసరమైన మేరకు రుణంగా ఇచ్చి తోడ్పాటునిస్తున్నాయి.
పాల సమాఖ్య ఏర్పాటు ఇలా
గ్రామాల్లో డ్వాక్రా సంఘాలుంటాయి. ఇందులోని మహిళలు మండల స్థాయిలో మహిళా సమాఖ్యను ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని డ్వాక్రా సంఘాల నుంచి ఎంపిక చేసిన మహిళలతో ఈ సమాఖ్యను ఏర్పాటు చేస్తారు. ఈ సమాఖ్యలు చిల్లింగ్ సెంటర్లను నిర్వహిస్తాయి. శ్రీజ డెయిరీని కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
సేకరించిన పాలలో వెన్న,
ఎస్ఎన్ఎఫ్ శాతాలు పరీక్షిస్తున్న పాలమిత్ర
సమతుల ఆహార విధానంలో దాణా ఇవ్వడం ప్రారంభించాక పాల దిగుబడి పెరిగింది. పాలలో వెన్న, ఎస్.ఎన్.ఎఫ్ శాతం కూడా పెరగడంతో లీటరుకు రూ.3 వరకు అదనంగా ధర వస్తోంది.
- లక్ష్మి, భాను, బుజ్జి
పశువులను మేపడం.. పాలు తీయడం.. దాన్ని విక్రయించడం అంతా నేనే చూసుకుంటాను. పాల విక్రయంతో ఆదాయం వస్తోంది. 15 రోజులకు ఒకసారి చెల్లింపులు చేస్తున్నారు. గ్రామాల్లోనే పాలలో వెన్న శాతం కొలిచే యంత్రాలు రావడంతో మా పాలకు ఎంత ధర వస్తుందో వెంటనే తెలిసిపోతోంది.
- మర్రి అనంతమ్మ,
సీతారాంపురం, ఏర్పేడు మండలం
[ఈనాడు వారి సౌజన్యంతో....]