వస్తు, సేవల పన్ను అమల్లోకి వస్తే..
కార్యరూపం దాల్చనున్న ఏకరూప పన్ను
ఒకే దేశం... ఎన్నో రకాలైన పన్నులు ఒకే వస్తువు... వివిధ రూపాల్లో పన్నులు, పన్నులు కట్టేవారు కొందరు... ఎగ్గొట్టేవారు ఎందరో... అంతా గజిబిజి పన్నుల విధానం... పన్నుల భారం మోసే ప్రజలకు అర్ధం కాని వ్యవహారం... మనదేశంలోని పన్నుల వ్యవస్ధలో ఉన్న లోపాలివి. వీటిని సరిదిద్ది సమర్ధమైన పన్నుల వ్యవస్ధగా భావిస్తున్న ఏకరూప పన్నుల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదే జీఎస్టీ. ఇది ప్రభుత్వాన్ని, వ్యాపార సంస్థలను, ప్రజలను విశేషంగా ప్రభావితం చేస్తుందని అంచనా. పలు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎంతోకాలంగా ఈ తరహా ఏకీకృత పన్ను విధానం అమల్లో ఉంది. మనదేశంలోనూ ఇది అమల్లోకి రాబోతోంది. జీఎస్టీ అంటే ఏమిటి, దీని ప్రభావం ఎలా ఉంటుంది...? |
* జీఎస్టీ అంటే ఏమిటి? ఎలా దీన్ని అమలు చేస్తారు?
ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాలైన పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని పన్నులను విధిస్తున్నాయి. ఎన్నో రకాలైన పన్నులతో గందరగోళమైన పన్నుల విధానం అమల్లో ఉంది. వీటన్నిటి స్ధానంలో ఒకటే ఏకీకృత పన్నుగా జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. దేశానికంతటికీ వర్తించే పరోక్ష పన్ను విధానమే జీఎస్టీ (వస్తు, సేవల పన్ను). దీనివల్ల పన్నుల విధింపునకు సంబంధించి ఒకటే మార్కెట్ అవుతుంది. అన్ని రకాలైన వస్తువులు, సేవలపై జీఎస్టీ విధిస్తారు. ఒక వస్తువు లేదా ఒక సేవకు వివిధ దశల్లో జత కలిసే విలువ ఆధారంగా ఇన్పుట్ క్రెడిట్ (పన్ను మినహాయింపు) లభిస్తుంది. తుది వినియోగదారుడు తాను ఏ రిటైల్ వర్తకుడి నుంచి వస్తువు లేదా సేవలు తీసుకుంటున్నాడో ఆ వర్తకుడు చెల్లించే జీఎస్టీని భరిస్తే సరిపోతుంది.
* ప్రభుత్వానికి ఇది మేలు చేసే పన్ను విధానమేనా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. అయిదారు రకాల పన్నులకు బదలు ఒకటే జీఎస్టీ వసూలు చేయవచ్చు. తద్వారా పన్నుల ఎగవేతను చాలావరకూ అరికట్టవచ్చు. పన్నుల భారం తగ్గుతుంది కాబట్టి వర్తకులు, వ్యాపారస్థులు కూడా ఎగవేతకు సిద్ధపడకపోవచ్చు. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. అంతేగాక పన్నుల వసూళ్లకు ప్రభుత్వం వెచ్చించే వ్యయాలు తగ్గుతాయి. ప్రభుత్వ ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుంది.
*వ్యాపార సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జీఎస్టీ రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు, రీఫండ్ కోరటం ఎంతో సులువు అవుతాయి. జీఎస్టీ అమల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. అందువల్ల దీనికి సంబంధించిన అన్ని రకాలైన పనులను వ్యాపార సంస్థలు ఆన్లైన్లోనే పూర్తిచేసేందుకు అవకాశం ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే పరోక్ష పన్ను రేటు అమలు అయ్యేందుకు జీఎస్టీ వీలుకల్పిస్తోంది. తద్వారా వ్యాపార కార్యకలాపాల నిర్వహణ సులువు అవుతుందని అంచనా. ఒక వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినా ఒకే ధర ఉంటుంది. ఇప్పటి మాదిరిగా ప్రాంతాన్ని, పన్ను రేటును బట్టి వస్తువు ధర మారిపోయే పరిస్థితి ఇకపై ఉండదు. జీఎస్టీ వల్ల లావాదేవీల వ్యయం తగ్గుతుంది. తత్ఫలితంగా వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. వ్యాపార సంస్థలు తమ అకౌంటింగ్, బిల్లింగ్ విధానాలను జీఎస్టీకి అనుగుణంగా మార్చుకోవలసి వస్తుంది.
* ఈ నూతన పన్ను విధానాన్ని ఎలా అమలు చేస్తారు?
కేంద్రం, రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు విభాగాలుగా జీఎస్టీని అమలు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ), స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ జీఎస్టీ అమల్లో పాలుపంచుకుంటాయి. ఏవో కొన్ని మినహాయింపులు తప్పిస్తే... దాదాపు ప్రతి ఒక్క వస్తువు, సేవ పై జీఎస్టీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జీఎస్టీని విధించి, వసూలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ జీఎస్టీని వసూలు చేస్తాయి. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ల్లో ఎక్కడికక్కడే ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్’ వర్తిస్తుంది. అంతేగాక ఒక చోట లభించే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను మరోచోటికి (సీజీఎస్టీ నుంచి ఎస్జీఎస్టీకి లేదా ఎస్జీఎస్టీ నుంచి సీజీఎస్టీ) బదలాయించే అవకాశం లేదు.
* సాంకేతిక పరిజ్ఞానం పాత్ర ఏమిటి?
దేశవ్యాప్తంగా జీఎస్టీని సమర్ధంగా అమల్లోకి తీసుకవచ్చే యత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పెద్దఎత్తున ఉపయోగించుకోనుంది. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్) పేరుతో ఒక స్వచ్ఛంద, లాభాపేక్ష లేని సంస్థను ఏర్పాటు చేస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పన్ను చెల్లింపుదార్లు, ఇతర వినియోగదార్లు వినియోగించుకునేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దుతారు. వ్యాపారస్తుల రిజిస్ట్రేషన్, ఆడిట్, మదింపు, అప్పీళ్లు... తదితర అన్ని అవసరాలకు అనుకూలమైనదిగా ఒక పోర్టల్ను ఆవిష్కరిస్తారు. ప్రభుత్వంతో పాటు బ్యాంకులు, అకౌంటింగ్ సంస్థలు,. ఆర్బిఐ, సంబంధిత ఇతర సంస్థలు కూడా జీఎస్టీ అమలుకు అనువైన ఐటీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. పన్ను రిటర్న్లను ఆన్లైన్లో దాఖలు చేయాలి.
* సెంట్రల్ జీఎస్టీని, స్టేట్ జీఎస్టీని ఎలా విధిస్తారు?
వస్తువులు, సేవలపై లావాదేవీ నమోదు అయిన వెంటనే అక్కడే సెంట్రల్, స్టేట్ జీఎస్టీ లను ఏక కాలంలో చెల్లించాలి. ఇప్పుడు ఒక వస్తువు విలువపై సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ వసూలు చేస్తున్నాయి. జీఎస్టీ విధానంలో వస్తువు విలువ మీదే సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ విధిస్తారు.
రెండు మూడు రాష్ట్రాల్లో జరిగిన లావాదేవీ అయితే...
రెండు మూడు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 269ఏ(1) ప్రకారం సమీకృత జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ రెండూ కలిసి ఎంత మొత్తం ఉంటుందో అంతకంటే సమీకృత జీఎస్టీ మించటానికి వీల్లేదు.
* దిగుమతులపై పన్ను విధింపు ఎలా?
ప్రస్తుతం దిగుమతులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ (సీవీడీ), ప్రత్యేక అదనపు డ్యూటీ (ఎస్ఏడీ) విధిస్తున్నారు. జీఎస్టీ వస్తే ఈ పన్నులు ఉండవు. అన్ని రకాలైన దిగుమతులపై సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ) ని వసూలు చేస్తారు.
* ఎప్పటి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది?
ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ తర్వాత జీఎస్టీ అమలు విషయంలో ఒక కీలకమైన ముందడుగు సాధించినట్లు అవుతుంది. దీన్ని దేశంలోని 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు ఆమోదించాలి. తదుపరి జీఎస్టీ అమలు విధానం, పన్ను రేటును నిర్ణయిస్తూ ప్రత్యేక బిల్లు పెట్టి ఆమోదిస్తారు. అన్ని అవరోధాలు అధిగమించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జీఎస్టీ ని అమల్లోకి తీసుకురావాలనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
* జీఎస్టీ రేటు ఎంత?
జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడుతుంది. ఇందులో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. జీఎస్టీ రేటు ఎంత ఉండాలనేది ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. జీఎస్టీ 18 శాతానికి మించరాదని కాంగ్రెస్ పార్టీ కోరుతుండగా, ప్రస్తుత ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుడు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇంకా అధిక రేటును నిర్ణయించాలని కోరుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సగటు ఏకీకృత పన్ను రేటు దాదాపు 20 శాతం ఉంది.
* జీఎస్టీ కింద వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ ఎలా చేపట్టాలి? ప్రస్తుత వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ చెల్లించే వారు మళ్లీ ప్రత్యేకంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదు. కొత్త వర్తకులకు మాత్రం జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం. దీనికి ఆన్లైన్లో ఒక దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసి మూడు రోజులు పూర్తయితే అనుమతి లభించినట్లే. దరఖాస్తు చేసుకున్న వారికి పాన్ ఆధారిత రిజిస్ట్రేషన్ నెంబర్ లభిస్తుంది, కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీకి ఇది సరిపోతుంది. |
* వివాదాల పరిష్కారం ఎలా?
జీఎస్టీ విషయంలో తలెత్తే వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి... అనే అంశంపై స్పష్టమైన విధానాన్ని ఇంకా రూపొందించలేదు. కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే జీఎస్టీ కౌన్సిల్కు వివాదాల పరిష్కార బాధ్యత అప్పగించాలనే ప్రతిపాదన ఉంది.
*ప్రభుత్వానికి పరోక్ష పన్నుల ఆదాయం పెరుగుతుందా?
పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరుగుతుందని అంచనా. అదే జరిగితే పన్నుల ఆదాయం అధికంగా ఉంటుందని ప్రాధమికంగా పరిశీలకులు లెక్కలు కడుతున్నారు.
*జీఎస్టీ అమలుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందా?
స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీని కొత్తగా అమలు చేసినప్పుడు కెనడా, న్యూజీల్యాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఇదే జరిగింది. కానీ పన్ను రేటు ను మరీ అధికంగా కాకుండా హేతుబద్ధమైన రీతిలో నిర్ణయించే అవకాశం ఉంది. అందువల్ల మనదేశంలో జీఎస్టీ అమలుతో ద్రవ్యోల్బణం మరీ అదుపు తప్పిపోకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం ఈనాటికి కాదు, దాదాపు దశాబ్దకాలంగా ఈ ఆలోచన ఉంది. జీఎస్టీని అమల్లోకి తీసుకురావటానికి గత యూపీఏ ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేసింది. కానీ దాన్ని అమల్లోకి తీసుకురాలేకపోయింది. ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో కీలకమైన ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను, అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి జీఎస్టీ అమలుకు వీలుకల్పించే రాజ్యాంగ సవరణను రాజ్యసభలో పెట్టి ఆమోదించింది. |
జీఎస్టీ వల్ల ఏఏ పన్నులు రద్దు అవుతాయి
కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కేంద్ర ఎక్సైజ్ పన్ను, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, అదనపు కస్టమ్స్ పన్ను (సీవీడీ), కస్టమ్స్పై ప్రత్యేక అదనపు డ్యూటీ, కేంద్ర అమ్మకం పన్ను, ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడిసినల్ అండ్ టాయిలెట్రీస్ ప్రిపరేషన్ యాక్ట్ రద్దవుతాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యాట్/ అమ్మకం పన్ను, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్/ ఎంట్రీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను, లాటరీ- బెట్టింగ్- గ్యాంబ్లింగ్ పై విధించే పన్నులు రద్దవుతాయి.
ఏవైనా వస్తువులు లేదా సేవలకు మినహాయింపు ఉంటుందా?
అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ ఉంటుంది. మద్యం, ముడి చమురు, హైస్పీడ్ డీజిల్, పెట్రోలు, సహజ వాయువు, విమాన ఇంథనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) పై జీఎస్టీ ఉంటుందా లేదా ఉంటే ఏవిధంగా... అనే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది.
రాష్ట్రాల ఆదాయాలు తగ్గుతాయనే ఆందోళలను ఎలా పరిష్కరించారు?
ఉత్పత్తి రంగం విస్తరించి వస్తూత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు జీఎస్టీ అమలు అయితే పన్ను ఆదాయాన్ని నష్టపోతాయి. ప్రస్తుతం అవి విధిస్తున్న పన్నులు రద్దు కావటం దీనికి కారణం. ఈ విధంగా పన్ను ఆదాయాన్ని కోల్పేయే రాష్ట్రాలకు అయిదేళ్ల పాటు నష్టపరిహారం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
పన్ను చెల్లింపులో వెసులుబాటు వస్తుందా..?
కాగితం రహిత పన్నుల చెల్లింపు విధానాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎలక్ట్రానిక్ చెల్లింపులను అనుమతిస్తారు. ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, నెఫ్ట్/ ఆర్టీజీఎస్ ద్వారా పన్నులు చెల్లించవచ్చు. చెక్కు లేదా బ్యాంకులో నగదు చెల్లించటానికి కూడా అవకాశం ఉంది. జీఎస్టీఎన్ నెంబరు తో ఒకటే చలాన్ నమోదు చేసి పన్ను చెల్లించవచ్చు.