Navigating the Unknown: Leadership in an Era of Uncertainty
 
 
ఆఫ్రికా వ్యవసాయంలో పెట్టుబడి న్యూఢిల్లీ :
భారత ఇన్వెస్టర్లు ఆఫ్రికా ఖండ దేశాల వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చక్కని అవకాశం వేచి చూస్తోంది. భారత ప్రభుత్వం సాంప్రదాయ వాణిజ్య భాగస్వాములే కాకుండా ఆఫ్రికా ఖండ దేశాలతో కూడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆఫ్రికాలో పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కూడా దోహదపడతాయి. అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కెపిఎంజి నివేదిక ప్రకారం ఆఫ్రికాలో వ్యవసాయ రంగంలో వృద్ధి అక్కడ ఉన్న సామర్థ్యాలకు దీటుగా లేదని తేల్చింది. వాణిజ్య పంటలు, విలువ ఆధారిత విభాగాల్లో విదేశీ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ఆఫ్రికా ప్రభుత్వాలు విధానాల్లో తగు మార్పులు చేయడం వల్ల వ్యవసాయ రంగం పూర్తి సామర్థ్యాలు వినియోగంలోకి వస్తాయని పేర్కొంది. ఆఫ్రికా దేశాల వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం తీసుకురావడానికి, మార్కెట్లను విస్తరించడానికి, చిన్న తరహా రైతులకు పరపతి సదుపాయాలు విస్తరించేందుకు విదేశీ ఇన్వెస్టర్లకు చక్కని అవకాశాలున్నట్టు తేల్చి చెప్పింది. ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ రంగం వృద్ధికి అవకాశాలు ఆపారంగా ఉన్నట్టు కూడా వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నందు వల్ల వ్యవసాయానికి సంబంధించిన టెలీ కమ్యూనికేషన్ సేవల విస్తరణలో కూడా చక్కని పెట్టుబడి అవకాశాలున్నాయని పేర్కొంది. ఆ 70 శాతం మందిలో 30 శాతం మందికి మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండడం వ్యవసాయాధారిత టెలీకమ్యూనికేషన్ సేవల విస్తరణలో గల అవకాశాలను సూచిస్తున్నదని తెలిపింది. అంతే కాదు ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయం విస్తరించాలంటే నీటిపారుదల వసతులు కల్పించాల్సి ఉంటుందని, ఉత్పాదకతల పెంపునకు ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుందని పేర్కొంటూ ఈ విభాగంలో కూడా విదేశీ ఇన్వెస్ట్మెంట్లకు అవకాశాలు అపారంగా ఉన్నట్టు వెల్లడించింది. ఆఫ్రికాలో ప్రపంచంలో నాలుగో వంతు వ్యవసాయ యోగ్యమైన భూములున్నప్పటికీ అక్కడ జరుగుతున్న వ్యవసాయం ప్రపంచ వ్యవసాయంలో పది శాతం మించి లేదని, ఈ కారణంగా ఆఫ్రికా భారీ పరిమాణంలో ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఉందని కెపిఎంజి నివేదిక పేర్కొంది.
(ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో)
Comments
Post a Comment